చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Thursday, December 29, 2011

మానవతా రసమాలయం!

ఏ ప్రాణినీ ఏకవచన సంబోధన ఎరుగని దివ్యత్వం, సహజ సౌందర్యం, సహజ కరుణ, సహజస్థితి భగవాన్ రమణ మహర్షులది. 'నేనెవరు?' అనే ఆధ్యాత్మ విచారణా బ్రహ్మాస్త్రాన్ని లోకానికి అందించిన రమణుల అవనీ సంచారం ప్రారంభమై 133 సంవత్సరాలు. నేడు రమణ మహర్షి జయంతి సందర్భంగా ఆ దివ్యమూర్తిని స్మరించుకుంటూ...

దినపత్రిక చదువుకుంటున్న రమణులతో సాన్నిహిత్యంతో ఆడుకుంటున్న ఉడతకు లేనిదల్లా భయమే! నదురు బెదురు ఎరగకుండా ఉడత ఉండగలగటం, దాని స్వభావం కానేకాదే! అభయావరణంలో ఉండలేనిది భయమే కదా! రాముడు తాకినట్లే రమణులూ ఉడతను తాకారు. స్పర్శన భగవదనుగ్రహమేగా! పప్పులు నోటికందిస్తూ దేహాన్ని నిమురుతూ రమణులు ఆత్మను స్పృశించటం ఎంత మనోహరం! కుక్కలన్నీ ఎంత వినయంగా తిరుగుతుంటాయి! ఎంత మౌనంగా మసలుకుంటాయి.

వంకర తోకలున్నా వంకరబుద్ధి లేకుండా ఎంత హాయిగా కదులుతుంటాయి. అదిలించకుండా దయనంతా వర్షిస్తూ భగవాన్! ఎంత నయనానందకర దృశ్యం! ప్రతి సాయంత్రం క్రమం తప్పకుండా దరిచేరే వానరాలకు ప్రేమతో తినిపించే జీడిపప్పులు, వేరుశనగ గింజలు, వాటిని అందుకుంటూ ప్రశాంతంగా ఆరగించే వాటి మానసిక పరిణతీ ఎంత అబ్బురం! ఆ క్షణాలలో భగవాన్ పెదవులు చిందించే సన్నని చిరునవ్వు ఎంత ముగ్ధం! ఎంత స్నిగ్ధం!

మాధవుని విన్యాసం

కెంజాయ పులుముకున్న సాయం సంధ్యాకాశం, అరుణాచలం మీద ఆడుకునే మేఘాలు, పరమ ప్రశాంతంగా మౌనముద్ర ధరించి తనను తాను చూసుకునే దృశ్యంలో సర్వాత్మ సౌందర్యాన్ని తన దివ్య నేత్రాంచలాలలో నిలుపుకున్న భగవాన్‌ని చూస్తూ మనసెరగని, హృదయ స్ఫురణతో నయనమనోహరంగా, లయబద్ధంగా నర్తించే మయూరాలు ఎంత ఆత్మానందాన్ని కలిగిస్తయ్! 'మాధవా' అని భగవాన్ ప్రేమగా పిలవగానే వినయంగా, భక్తిగా నడిచివచ్చి, ఠీవీగా భగవాన్ ముందు మెడ ఎత్తి నుంచునే మయూర విన్యాసం, ఎంత మధురం! గోవు లక్ష్మిని సాకిన వైనం, సాగనంపిన తీరు ఎంత దయామయం! 'ఏమ్మా!' అని మహర్షి పిలిచినపుడల్లా కళ్లనిండా ఆనందాన్ని, పొదుగునిండా పాలను భరించలేనంతగా నింపుకున్న ఆవు నడకలు ఎంత అద్భుతం! అరుణాచలం మీద నలుగురితో నడుస్తున్నపుడు, నీటికుంటలో నీళ్ళు తాగాలనుకున్న పులిని చూసి అందరూ భయంతో వణుకుతున్నపుడు 'వారు వచ్చిన పని పూర్తికాగానే వచ్చినదారినే వెళతారు' అంటూ భగవాన్ భయం తీర్చడం ఎంత హాయి?

దశరూపుడు రమణుడు

తమిళనాడులోని మధురలో ఐదవ ఫారమ్ చదువుతున్న వెంకటరామన్ అనే విద్యార్థికి మరణానుభవంలో జరిగిన ఆత్మసాక్షాత్కారమే భగవాన్ రమణ మహర్షిగా మార్చింది. 1879 డిసెంబర్ 30వ తేదీన జన్మించిన వెంకటరామన్ జ్ఞానజ్యోతి అయిన తన తండ్రిని అన్వేషిస్తూ 1896 సెప్టెంబర్ 1న తిరువణ్ణామలై చేరారు. 1950 ఏప్రిల్ 14న తనువు చాలించే వరకు అరుణాచలంలోనే ఆయన నివసించారు. ఇతర పర్వతాలపై ఈశ్వరుడు వెలిస్తే అరుణాచలమే ఈశ్వరునిగా కొలువై ఉన్నాడు.

అందుకనే ఇక్కడ గిరి ప్రదక్షిణం కేత్ర విధి. ఎన్నో దివ్యస్థలాలకు నెలవైన అరుణాచలంలో కౌపీనం ధరించి నిరంతరం ఆత్మనిష్ఠుడైన బాలుడిని అక్కడి స్థానికులు బ్రాహ్మణస్వామి అని పిలిచేవారు. గణపత్యంశ సంజాతుడైన కాశ్యకంఠ గణపతిముని 1907 నవంబర్ 18న విరూపాక్ష గుహ సమీపాన బ్రాహ్మణ స్వామిని దర్శించి తన ధర్మసందేహాలను తీర్చుకుని, ఆ బాలునికి భగవాన్ రమణమహర్షిగా నామధారణ చేశారు. గణపతిముని దృష్టిలో రమణుడు పరమ శివుని కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి.

అలాగే చాలామంది భక్తులు రమణ మహర్షిలో తమ ఆరాధ్య దైవాలను దర్శించుకున్నారు. కుమారస్వామి భక్తులకు స్కందావతారంగా, రామ భక్తులకు శ్రీరామచంద్రుడిగా, కృష్ణ భక్తులకు శ్రీకృష్ణావతారంలో. జ్ఞాన పిపాసులకు దక్షిణామూర్తిగా. క్రైస్తవులకు ఏసుప్రభువుగా, ముస్లింలు మహమ్మద్ ప్రవక్తగా రమణులు దర్శనమిచ్చారు. బౌద్ధులకు బుద్ధ భగవానునిగా ఆయన దర్శనమిచ్చారు.

భగవాన్ తన భక్తులకు వారి ఇచ్ఛ మేరకు వారి ఇష్ట దైవాలుగా దర్శనమిచ్చారు. జ్ఞానిని గుర్తించడం ఎలా అని ప్రశ్నించిన భక్తులకు 'ఎవరి సన్నిధిలో ప్రశాంతత లభిస్తుందో అతనినే జ్ఞానిగా గుర్తించండి' అన్నారు భగవాన్. రమణ మహర్షుల వారి భక్తులందరూ ఆయన సన్నిధిలో అలాంటి శాంతిని పొందినవారే! ఆది శంకరుల అనంతరం రెండు వేల ఏండ్లకు అద్వైతానికి పూర్వప్రతిష్ఠ సమకూర్చడానికి అవతరించిన మహాజ్ఞాని భగవాన్ రమణ మహర్షి.
- రావినూతల శ్రీరాములు


అద్వైత భూమిక

రాజసర్పం తన పాదాల మీదగా పాకి వెళ్లగానే చూస్తున్న వారందరూ 'భగవాన్! భయంకరమైన పాపము మిమల్ని ఏం చేస్తుందోనని భయపడ్డాం' అన్నపుడు, 'ఏం లేదు! చల్లగా, మెత్తగా తాకినట్లయింది' అనే భగవాన్ సమాధానం, నిర్భయమే నిజమైన అనుభవం అనిపించడం ఎంతటి దివ్యబోధ! పౌర్ణమి వెన్నెలంతా పరమశివుడి చిదానందంలా, కదలని అరుణగిరి, సర్వసృష్టిని కదిలించే పరమాత్మలా, కోకిలల కుహూ కుహూల కలగానం, జీవుడి వేదనలా, కేకి కేకలన్నీ స్తుతి గీతాలుగా, కోతుల చేతలన్నీ మనోనర్తనంలా, గోవుల కదలికలన్నీ జ్ఞానార్థులైన తపస్వుల సంచారంగా, పాము ముంగిసల పోట్లాట జన్మలు గడచినా తీరని వైరంగా, ఎడత నడత భగవంతుడి దరిచేరిన అనుభవంలా, కాకుల గోలంతా జీవుడి పరివేదనలా, కుక్కల సంచారమంతా మూర్తిమంతమైన విశ్వాసంలా, ఆశ్రమావరణమంతా అణువణువూ నింపుకున్న పవిత్రతలా, మాటలు మౌనంలో విశ్రమించే మధురభావనలా, భగవాన్ నిలుచున్న చోటంతా అద్వైత భూమికలా, రమణాశ్రమం జీవుడి హృదయగుహకు గుర్తు! 'మీరందరూ, మీ విలువైన సమయమంతా ఈ మాట్లాడని మనిషి ముందు కూచుని ఎందుకు వృథా చేసుకుంటారు? ఇంతకీ ఈయన దేవుడని ఎందుకనుకుంటున్నారు? నాకు ఏమీ అర్థం కావడం లేదు' అని ఒకరు ప్రశ్నించినపుడు:

'ఏ మనిషైనా సహజంగా నిర్దయుడు. మహా అయితే సానుభూతి కురిపించగలడు. మేం ఎవరి ముందు కూర్చున్నామో ఆయన మూర్తీభవించిన, పల్లవించిన, పరిమళించిన మానవతా రసమాలయం! అందుకే రమణులు భగవాన్' అన్నది సమాధానం. ప్రశ్నించింది... నృత్య కళాకారిణి చంద్రలేఖ! సమాధానమిచ్చింది... హరీంద్రనాథ్ చటోపాధ్యాయ!! 'సర్వప్రాణుల యందు సమభావంతో, కరుణ్రార్థంతో సంచరించిన రమణుల దివ్యజీవన విధానం ఆదర్శయోగం. తిరుగులేని సమర్పణకు, ఆత్మార్పణకు రమణులు సాకార స్వరూపం.' ఆత్మానుభవం కలిగిన తర్వాత 54 సంవత్సరాలు మానవాళి సముద్ధరణ కోసం నిలకడ చెంది, ఆత్మభావనలో సంచరించడం ప్రపంచ ఆధ్యాత్మ చరిత్రలో ఒక అపురూప సన్నివేశం. ఒక మంగళాత్మక సంఘటన. అరుణాచలేశ్వర దేవళంలో దేవర; అరుణాచలం, అచలమహాస్థితిలో కదలని మౌనం; అరుణాచల రమణులు, ఘనీభవించిన మౌనం; మాటమలగి, మౌనం వెలగాలి. ఆ వెలుగులో ఆత్మాన్వేషణ సాగాలి. 'ఉన్నదంతా ఆత్మే! నేనూ అనే దానికంటే భిన్నం కాదు' అను ఎరుకతో జీవించాలి. అదే జీవన్ముక్తి!
- వి.యస్.ఆర్.మూర్తి
ఆధ్మాత్మిక శాస్త్రవేత్త

No comments:

Post a Comment