చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Thursday, December 29, 2011

మానవతా రసమాలయం!

ఏ ప్రాణినీ ఏకవచన సంబోధన ఎరుగని దివ్యత్వం, సహజ సౌందర్యం, సహజ కరుణ, సహజస్థితి భగవాన్ రమణ మహర్షులది. 'నేనెవరు?' అనే ఆధ్యాత్మ విచారణా బ్రహ్మాస్త్రాన్ని లోకానికి అందించిన రమణుల అవనీ సంచారం ప్రారంభమై 133 సంవత్సరాలు. నేడు రమణ మహర్షి జయంతి సందర్భంగా ఆ దివ్యమూర్తిని స్మరించుకుంటూ...

దినపత్రిక చదువుకుంటున్న రమణులతో సాన్నిహిత్యంతో ఆడుకుంటున్న ఉడతకు లేనిదల్లా భయమే! నదురు బెదురు ఎరగకుండా ఉడత ఉండగలగటం, దాని స్వభావం కానేకాదే! అభయావరణంలో ఉండలేనిది భయమే కదా! రాముడు తాకినట్లే రమణులూ ఉడతను తాకారు. స్పర్శన భగవదనుగ్రహమేగా! పప్పులు నోటికందిస్తూ దేహాన్ని నిమురుతూ రమణులు ఆత్మను స్పృశించటం ఎంత మనోహరం! కుక్కలన్నీ ఎంత వినయంగా తిరుగుతుంటాయి! ఎంత మౌనంగా మసలుకుంటాయి.

వంకర తోకలున్నా వంకరబుద్ధి లేకుండా ఎంత హాయిగా కదులుతుంటాయి. అదిలించకుండా దయనంతా వర్షిస్తూ భగవాన్! ఎంత నయనానందకర దృశ్యం! ప్రతి సాయంత్రం క్రమం తప్పకుండా దరిచేరే వానరాలకు ప్రేమతో తినిపించే జీడిపప్పులు, వేరుశనగ గింజలు, వాటిని అందుకుంటూ ప్రశాంతంగా ఆరగించే వాటి మానసిక పరిణతీ ఎంత అబ్బురం! ఆ క్షణాలలో భగవాన్ పెదవులు చిందించే సన్నని చిరునవ్వు ఎంత ముగ్ధం! ఎంత స్నిగ్ధం!

మాధవుని విన్యాసం

కెంజాయ పులుముకున్న సాయం సంధ్యాకాశం, అరుణాచలం మీద ఆడుకునే మేఘాలు, పరమ ప్రశాంతంగా మౌనముద్ర ధరించి తనను తాను చూసుకునే దృశ్యంలో సర్వాత్మ సౌందర్యాన్ని తన దివ్య నేత్రాంచలాలలో నిలుపుకున్న భగవాన్‌ని చూస్తూ మనసెరగని, హృదయ స్ఫురణతో నయనమనోహరంగా, లయబద్ధంగా నర్తించే మయూరాలు ఎంత ఆత్మానందాన్ని కలిగిస్తయ్! 'మాధవా' అని భగవాన్ ప్రేమగా పిలవగానే వినయంగా, భక్తిగా నడిచివచ్చి, ఠీవీగా భగవాన్ ముందు మెడ ఎత్తి నుంచునే మయూర విన్యాసం, ఎంత మధురం! గోవు లక్ష్మిని సాకిన వైనం, సాగనంపిన తీరు ఎంత దయామయం! 'ఏమ్మా!' అని మహర్షి పిలిచినపుడల్లా కళ్లనిండా ఆనందాన్ని, పొదుగునిండా పాలను భరించలేనంతగా నింపుకున్న ఆవు నడకలు ఎంత అద్భుతం! అరుణాచలం మీద నలుగురితో నడుస్తున్నపుడు, నీటికుంటలో నీళ్ళు తాగాలనుకున్న పులిని చూసి అందరూ భయంతో వణుకుతున్నపుడు 'వారు వచ్చిన పని పూర్తికాగానే వచ్చినదారినే వెళతారు' అంటూ భగవాన్ భయం తీర్చడం ఎంత హాయి?

దశరూపుడు రమణుడు

తమిళనాడులోని మధురలో ఐదవ ఫారమ్ చదువుతున్న వెంకటరామన్ అనే విద్యార్థికి మరణానుభవంలో జరిగిన ఆత్మసాక్షాత్కారమే భగవాన్ రమణ మహర్షిగా మార్చింది. 1879 డిసెంబర్ 30వ తేదీన జన్మించిన వెంకటరామన్ జ్ఞానజ్యోతి అయిన తన తండ్రిని అన్వేషిస్తూ 1896 సెప్టెంబర్ 1న తిరువణ్ణామలై చేరారు. 1950 ఏప్రిల్ 14న తనువు చాలించే వరకు అరుణాచలంలోనే ఆయన నివసించారు. ఇతర పర్వతాలపై ఈశ్వరుడు వెలిస్తే అరుణాచలమే ఈశ్వరునిగా కొలువై ఉన్నాడు.

అందుకనే ఇక్కడ గిరి ప్రదక్షిణం కేత్ర విధి. ఎన్నో దివ్యస్థలాలకు నెలవైన అరుణాచలంలో కౌపీనం ధరించి నిరంతరం ఆత్మనిష్ఠుడైన బాలుడిని అక్కడి స్థానికులు బ్రాహ్మణస్వామి అని పిలిచేవారు. గణపత్యంశ సంజాతుడైన కాశ్యకంఠ గణపతిముని 1907 నవంబర్ 18న విరూపాక్ష గుహ సమీపాన బ్రాహ్మణ స్వామిని దర్శించి తన ధర్మసందేహాలను తీర్చుకుని, ఆ బాలునికి భగవాన్ రమణమహర్షిగా నామధారణ చేశారు. గణపతిముని దృష్టిలో రమణుడు పరమ శివుని కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి.

అలాగే చాలామంది భక్తులు రమణ మహర్షిలో తమ ఆరాధ్య దైవాలను దర్శించుకున్నారు. కుమారస్వామి భక్తులకు స్కందావతారంగా, రామ భక్తులకు శ్రీరామచంద్రుడిగా, కృష్ణ భక్తులకు శ్రీకృష్ణావతారంలో. జ్ఞాన పిపాసులకు దక్షిణామూర్తిగా. క్రైస్తవులకు ఏసుప్రభువుగా, ముస్లింలు మహమ్మద్ ప్రవక్తగా రమణులు దర్శనమిచ్చారు. బౌద్ధులకు బుద్ధ భగవానునిగా ఆయన దర్శనమిచ్చారు.

భగవాన్ తన భక్తులకు వారి ఇచ్ఛ మేరకు వారి ఇష్ట దైవాలుగా దర్శనమిచ్చారు. జ్ఞానిని గుర్తించడం ఎలా అని ప్రశ్నించిన భక్తులకు 'ఎవరి సన్నిధిలో ప్రశాంతత లభిస్తుందో అతనినే జ్ఞానిగా గుర్తించండి' అన్నారు భగవాన్. రమణ మహర్షుల వారి భక్తులందరూ ఆయన సన్నిధిలో అలాంటి శాంతిని పొందినవారే! ఆది శంకరుల అనంతరం రెండు వేల ఏండ్లకు అద్వైతానికి పూర్వప్రతిష్ఠ సమకూర్చడానికి అవతరించిన మహాజ్ఞాని భగవాన్ రమణ మహర్షి.
- రావినూతల శ్రీరాములు


అద్వైత భూమిక

రాజసర్పం తన పాదాల మీదగా పాకి వెళ్లగానే చూస్తున్న వారందరూ 'భగవాన్! భయంకరమైన పాపము మిమల్ని ఏం చేస్తుందోనని భయపడ్డాం' అన్నపుడు, 'ఏం లేదు! చల్లగా, మెత్తగా తాకినట్లయింది' అనే భగవాన్ సమాధానం, నిర్భయమే నిజమైన అనుభవం అనిపించడం ఎంతటి దివ్యబోధ! పౌర్ణమి వెన్నెలంతా పరమశివుడి చిదానందంలా, కదలని అరుణగిరి, సర్వసృష్టిని కదిలించే పరమాత్మలా, కోకిలల కుహూ కుహూల కలగానం, జీవుడి వేదనలా, కేకి కేకలన్నీ స్తుతి గీతాలుగా, కోతుల చేతలన్నీ మనోనర్తనంలా, గోవుల కదలికలన్నీ జ్ఞానార్థులైన తపస్వుల సంచారంగా, పాము ముంగిసల పోట్లాట జన్మలు గడచినా తీరని వైరంగా, ఎడత నడత భగవంతుడి దరిచేరిన అనుభవంలా, కాకుల గోలంతా జీవుడి పరివేదనలా, కుక్కల సంచారమంతా మూర్తిమంతమైన విశ్వాసంలా, ఆశ్రమావరణమంతా అణువణువూ నింపుకున్న పవిత్రతలా, మాటలు మౌనంలో విశ్రమించే మధురభావనలా, భగవాన్ నిలుచున్న చోటంతా అద్వైత భూమికలా, రమణాశ్రమం జీవుడి హృదయగుహకు గుర్తు! 'మీరందరూ, మీ విలువైన సమయమంతా ఈ మాట్లాడని మనిషి ముందు కూచుని ఎందుకు వృథా చేసుకుంటారు? ఇంతకీ ఈయన దేవుడని ఎందుకనుకుంటున్నారు? నాకు ఏమీ అర్థం కావడం లేదు' అని ఒకరు ప్రశ్నించినపుడు:

'ఏ మనిషైనా సహజంగా నిర్దయుడు. మహా అయితే సానుభూతి కురిపించగలడు. మేం ఎవరి ముందు కూర్చున్నామో ఆయన మూర్తీభవించిన, పల్లవించిన, పరిమళించిన మానవతా రసమాలయం! అందుకే రమణులు భగవాన్' అన్నది సమాధానం. ప్రశ్నించింది... నృత్య కళాకారిణి చంద్రలేఖ! సమాధానమిచ్చింది... హరీంద్రనాథ్ చటోపాధ్యాయ!! 'సర్వప్రాణుల యందు సమభావంతో, కరుణ్రార్థంతో సంచరించిన రమణుల దివ్యజీవన విధానం ఆదర్శయోగం. తిరుగులేని సమర్పణకు, ఆత్మార్పణకు రమణులు సాకార స్వరూపం.' ఆత్మానుభవం కలిగిన తర్వాత 54 సంవత్సరాలు మానవాళి సముద్ధరణ కోసం నిలకడ చెంది, ఆత్మభావనలో సంచరించడం ప్రపంచ ఆధ్యాత్మ చరిత్రలో ఒక అపురూప సన్నివేశం. ఒక మంగళాత్మక సంఘటన. అరుణాచలేశ్వర దేవళంలో దేవర; అరుణాచలం, అచలమహాస్థితిలో కదలని మౌనం; అరుణాచల రమణులు, ఘనీభవించిన మౌనం; మాటమలగి, మౌనం వెలగాలి. ఆ వెలుగులో ఆత్మాన్వేషణ సాగాలి. 'ఉన్నదంతా ఆత్మే! నేనూ అనే దానికంటే భిన్నం కాదు' అను ఎరుకతో జీవించాలి. అదే జీవన్ముక్తి!
- వి.యస్.ఆర్.మూర్తి
ఆధ్మాత్మిక శాస్త్రవేత్త

Monday, September 19, 2011

' జీవాలను కాసి జీవితంలో గెలిచా ' - చింతల వెంకటరమణ

 












బాల్యంలో ఉండగా గొర్రెలు కాయడంలోనే ఆనందం ఉందనుకున్నాడు. స్కూల్‌కి వెళ్లడాన్ని ఇష్టపడేవాడు కాదు. కాని ఇప్పుడు... గొర్రెల వెంట వెళ్తే 'గొర్రెతోక బెత్తెడు' సామెతలానే జీవితం ఉంటుందని చెపుతూ అందరూ ఉన్నతమైన చదువులు చదవాలి అంటున్నాడు. చదువుతో పాటు ఆంగ్ల భాషపై పట్టు సాధిస్తే చాలు ప్రపంచాన్ని ముంగిట్లో నిలుపుకోవచ్చు అంటున్నాడు. పదో తరగతి మూడుసార్లు తప్పి, ఇంటర్మీడియెట్ ఇన్‌స్టంట్‌లో పాసయిన చింతల వెంకటరమణ(28) ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పిహెచ్‌డి స్కాలర్. అంతేకాదు విదేశీ విశ్వవిద్యాలయాల్లో పేపర్ ప్రెజెంటేషన్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడితను 'నిశ్చింతల' వెంకటరమణ. ఈ ఎదుగుదల గురించి అతని మాటల్లోనే...

"ముందుగా మా కుటుంబనేపథ్యం చెప్తాను. మా స్వగ్రామం చిత్తూరు జిల్లా, సదుం మండలంలోని బక్తలవారిపల్లె. అమ్మ పేరు చిన్నక్క, నాన్న పేరు మల్లయ్య. మా అమ్మానాన్నకి పెళ్లయిన 27 యేళ్ల తరువాత పుట్టాను నేను. మాది కురుమ కులం. గొర్రెల కాపర్ల కుటుంబం మాది. మాకు నలభై గొర్రెలు ఉండేవి. వాటిని మేతకు తీసుకెళ్లి వాటివెంట తిరగడమంటే తెగ ఇష్టం నాకు. అందుకే స్కూల్‌కి సరిగా వెళ్లేవాడ్ని కాదు. ఎలాగోలా ఆ ఊళ్లోనే ఏడవ తరగతి అయ్యిందనిపించాను. ఆ తరువాత చదువు గురించి మళ్లీ ఆలోచించలేదు.
ఎరువుకి తిండిపెట్టే వాళ్లు

రాయలసీమలో వర్షాలు తక్కువ కావడంతో నీళ్ల కరువు. మరీ ముఖ్యంగా వేసవికాలంలో గొర్రెలకు మేత, నీళ్ల కోసం ఎంత దూరమయినా తీసుకెళ్లే వాళ్లం. మాకున్న నలభై గొర్రెల్ని తోలుకుని నేను, మా నాన్న దాదాపు నెల్లూరు సరిహద్దు వరకు వెళ్లేవాళ్లం. మాతోపాటు మరికొందరు గొర్రెల కాపర్లు కూడా వచ్చేవాళ్లు. గొర్రెల ఎరువు పొలాల్లో వేసినందుకు ఒకరోజు తిండి పెట్టి, ఒక బీడీ కట్ట ఇచ్చే వాళ్లు ఆ పొలాల యజమానులు. మరొక పొలం దొరికే వరకు మేమే తిండి వండుకోవాలి. అందుకని వంటసామాగ్రి కూడా వెంట తీసుకెళ్లాలి. నేను చిన్నోడ్ని కావడంతో రాత్రుళ్లు నిద్రపోయేవాడ్ని. కాని పెద్దవాళ్లు మాత్రం గొర్రెలకు కాపలాగా ఒక్కొక్కరు రెండేసి గంటల చొప్పున నిద్ర మేలుకుని ఉండేవారు.
మాంసం మాకు దండిగా సంవత్సరం పొడవునా ఉండేది. ఎందుకంటే ఊళ్లలో పొట్టేలు మాంసం కొంటారు కాని గొర్రె మాంసం అంతగా అమ్ముడుపోయేది కాదు. (నవ్వుతూ బహుశా ఆడదనేమో...) అందుకని గొర్రెలు చనిపోతే ఆ మాంసాన్ని ఎండ పెట్టి మేమే వాడుకునే వాళ్లం. అలాగే గొర్రెల చర్మం ఒలవడంలో ఒక నేర్పు ఉంటుంది. ఆ నేర్పు నాకు ఏడో తరగతిలోనే అలవడింది. చిన్న వయసులోనే ఆ నేర్పు రావడానికి కారణం లేకపోలేదు. ఒకసారి గొర్రె చర్మం తీస్తున్నప్పుడు చిన్న రంధ్రం పడింది. అది చూసి మా అమ్మ బాగా తిట్టింది. ఎందుకంటే రెండు వందలకు కొనే చర్మం చిన్న రంధ్రం పడితే పది రూపాయలకే అమ్మాలి. అప్పుడు మా బంధువువైన అన్నయ్య ఒకరు నాలుగైదు చర్మాలు తీయరా నష్టం నేను భరిస్తా అన్నాడు. దాంతో బాగా తీయడం వచ్చింది. ఇప్పటికీ గొర్రె చర్మాన్ని కొద్దిగా కూడా డామేజ్ కాకుండా తీయగలను.

కసి రగిలింది

కొన్నాళ్ల తర్వాత మా ఇంట్లో వాళ్లు నన్ను మళ్లీ బడిలో చేర్చేందుకు ప్రయత్నించారు. కాని ఏడో తరగతి తరువాత చాలా గ్యాప్ రావడంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోలేదు. దాంతో పక్క మండలంలోని ప్రైవేట్ స్కూల్‌లో పదవతరగతిలో చేరాను. స్కూల్లో అయితే చేరానే కాని చదువు మీద ధ్యాస ఉండేది కాదు. దాంతో మొదటిసారి రాసిన పబ్లిక్ పరీక్షల్లో మూడు సబ్జెక్ట్స్ ఫెయిలయ్యాను. రెండోసారి రాశాను. మళ్లీ తప్పాను. ఫలితం... రెండోసారీ చదువుకు బ్రేక్ పడింది. చదువు ఇక ఒంటపట్టదనుకున్నాను. మళ్లీ గొర్రెల కాపరిగా వెళ్లడం మొదలుపెట్టాను.

ఒకసారి గొర్రెల్ని తీసుకుని నేను, మా నాన్న ఊరు వదిలి బయటికి వెళ్లినప్పుడు. మా ఊళ్లో పెద్ద గొడవ జరిగింది. మా ఊళ్లో మా కులానికి చెందిన కుటుంబాలు 40 ఉంటే... 39 కుటుంబాలు ఒకవైపూ, మా కుటుంబం ఒక్కటీ ఒకవైపు ఉండిపోయింది. సామాజిక బహిష్కరణ విధించారు మా మీద. బోరింగు పంపు దగ్గర నీళ్లు పట్టుకోనిచ్చే వారు కాదు. గొర్రెల్ని తీసుకుని వాళ్ల ఇళ్ల ముందునుంచి వెళ్లనిచ్చేవాళ్లు కాదు. ఆఖరికి ఉప్పు కొనుక్కోవాలన్నా టౌన్‌కి వెళ్లాల్సిందే. నలుగురూ నాలుగువైపులా తొక్కేయడంతో నాలో కసి రగులుకుంది.
గొర్రెలతో పాటు నడుస్తున్నప్పుడు... నేనేమిటి? నా జీవితం ఏమైపోతోంది? అని ఆలోచించేవాడ్ని. ఆ సమయంలోనే దూరవిద్య ద్వారా పదవతరగతి పాస్ కావొచ్చని మా ఊళ్లో ఉండే వసంత్ చెప్పాడు. అందుకు సంబంధించిన పత్రికా ప్రకటన కటింగ్ తెచ్చి నాకు చూపించాడు. అది నేషనల్ ఓపెన్ స్కూల్ ప్రకటన. అతనే దగ్గరుండి నన్ను తిరుపతి తీసుకెళ్లాడు. వివరాలు కనుక్కుంటే నాలుగువేలు కడితే పదో తరగతి పరీక్షలు రాయొచ్చని చెప్పారు.

ఇంటికి వచ్చి అమ్మానాన్నలకు చెప్పాను. ఒక్కో గొర్రెకు పదిహేను వందల రూపాయలు వస్తాయి. మూడు గొర్రెల్ని అమ్మి ఫీజు కట్టమని డబ్బు ఇచ్చారు. అయితే వసంత్ వాళ్ల నాన్న... డబ్బులు కడితే పాస్ చేస్తారనడం మోసం అన్నాడు. అయినా నేనొక్కడినే తిరుపతి వెళ్లి డబ్బులు కట్టి పుస్తకాలు తెచ్చుకున్నాను. అలా పదో తరగతి మూడోసారి అత్తెసరు మార్కులతో పాసయ్యేందుకు మార్గం ఏర్పడింది. పదో తరగతి పాసవడం అనేది నా జీవితంలో ఊహించని పరిణామం. అయితే పరీక్షా ఫలితాలు ఆలస్యంగా రావడంతో ఇంటర్మీడియెట్ అడ్మిషన్లు పూర్తయిపోయాయి.

ఇక మళ్లీ గొర్రెలే నా జీవితం అనుకుంటున్న సమయంలో మా బంధువులాయన ఒకరు నేరుగా ఇంటర్మీడియెట్ బోర్డ్‌కి ఫీజు కడితే పరీక్షలు రాయొచ్చని చెప్పాడు. 130 రూపాయలు కట్టి హెచ్ఇసి గ్రూపు తీసుకున్నాను. మొదటి ఏడాది తెలుగు, పాలిటిక్స్ మాత్రమే పాసయ్యాను. మిగతా సబ్జెక్ట్‌లన్నీ ఫెయిల్. అప్పుడు నాకు బట్టీ బట్టి రాయమని సలహా ఇచ్చారు. అలానే చేసి మిగతావన్నీ పాసయ్యాను. కాని మళ్లీ ఇంగ్లీషు సబ్జెక్ట్ పోయింది. ఆ ఒక్కటీ ఇన్‌స్టంట్ పరీక్ష రాసి 37 మార్కులతో పాసయ్యాను. తరువాత డిగ్రీ కోసం పీలేరు వెళ్లడం నా జీవితాన్ని మలుపు తిప్పింది.

బతికించే చదువు వేరు...

డిగ్రీలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్‌ను చంద్రయ్య మాస్టారు బోధించేవారు. ఆయన విద్యతో పాటు జీవితంలో పైకి వచ్చే అవకాశాల గురించి కూడా చెప్పేవారు. అదే నా జీవితపథంలో మార్పు తెచ్చింది. ఆయన ప్రోత్సాహంతోనే గ్రూప్ ఎగ్జామ్స్ ఉంటాయని, సెంట్రల్ యూనివర్శిటీలో చేరి చదవొచ్చనేలాంటి విషయాలు తెలిశాయి. డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉండగా గ్రూప్స్ రాసి సెలెక్ట్ అయ్యాను. హైదరాబాద్‌లోని ఆర్‌సి రెడ్డి కోచింగ్ సెంటర్‌కి వెళ్లమని చెప్పారు సార్.

ఆయన చెప్పినట్టే పది గొర్రెలు అమ్మేసి డబ్బులు తీసుకుని హైదరాబాద్‌లో కోచింగ్ కోసం చేరాను. కాని ఏవో కారణాల వల్ల మెయిన్స్ పరీక్ష జరగలేదు. అప్పుడే సెంట్రల్ యూనివర్శిటీ నోటిఫికేషన్ పడింది. దాంతో యూనివర్శిటీకి వెళ్లి దరఖాస్తు కొన్నాను. కానీ నాకది ఎలా పూర్తి చేయాలో కూడా అర్థంకాలేదు. అది ఇంగ్లీషులో ఉండడంతో ఒకతన్ని అడిగి దరఖాస్తు పూర్తి చేయించాను. అలా ఎమ్మే పొలిటికల్ సైన్సుకి అప్లయ్ చేశాను. ఒబిసి కోటాలో వెయిటింగ్ లిస్ట్ 5 వ నంబరు నాది. ఎవరైనా రాకపోతే సమాచారం చెప్తామన్నారు. అప్పుడు స్టూడెంట్ లీడర్ నగేష్ రెడ్డి నువ్వు ఇంటికెళ్లిపో సీటు వస్తే నేను చెప్తానన్నారు. సరిగ్గా ఒక నెల తరువాత ఫోన్ చేసి సీట్ ఉంది రమ్మన్నారు.

ఒక స్టూడెంట్ జెఎన్‌యుకి వెళ్లిపోవడంతో సీటు వచ్చింది. అలా 2005 లో ఎమ్మేలో చేరాను. పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ పట్ల నాకు ఆసక్తి కలగడానికి కారణం చంద్రయ్య సారే. ఆయన ఎప్పుడూ ఇంగ్లీషు నేర్చుకోండి. వట్టి డిగ్రీలు తిండి పెట్టవనేవారు. అందుకు నా జీవితమే చక్కటి ఉదాహరణ. క్యాంపస్‌లో అడుగుపెట్టినప్పుడు ఒక్క ముక్క ఇంగ్లీషు మాట్లాడడం వచ్చేది కాదు. అప్పటివరకు ఇంగ్లీషులో మార్కులు 37 మించిన దాఖలాలు లేవు. అందుకని హాస్టల్‌లో రూమ్ ఇస్తున్న ఇన్‌చార్జ్ తో చెప్పాను- తెలుగు మాట్లాడడం రాని విద్యార్ధులున్న గదిలో నన్ను ఉంచండని. వాళ్లు నాకు నాగాలాండ్‌కు చెందిన అకాయ్‌తో గది పంచుకోమని చెప్పారు. ఇంగ్లీషులో నా గాడ్‌ఫాదర్ ఆయనే. మొదట్లో బాడీ లాంగ్వేజ్‌తో సంభాషించేవాడ్ని. అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పేవారు అకాయ్. ఎమ్మే పూర్తయ్యేసరికి ఆంగ్లంపై పట్టు వచ్చింది.

"ఐ... ఐ... మార్క్ ్స... తెలుగు మీడియం...''

ఎమ్మేలో చేరిన కొత్తలో ఎగ్జామ్ రాసినప్పుడు హెచ్ఒడి సారంగి నాకు సున్నా మార్కులు వేశారు. ఆయనే పొలిటికల్ సైన్స్ కూడా బోధించేవారు. ఆయనతో మాట్లాడడం కోసం ఆయన గదికి వెళ్లి "ఐ... ఐ... మార్క్స్... తెలుగు మీడియం...'' అని ముక్కలు ముక్కలుగా మాట్లాడాను. అప్పట్లో 'ఐ గాట్' అనాలనే విషయం కూడా తెలియదు. అప్పుడాయన ఒకటే చెప్పారు... చదువు రాలేదని బెదిరిపోయి ఇంటికెళ్లొద్దు. పట్టుదలగా చదువుకో వస్తుందన్నారు. పిజి ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాను. ఆ తరువాత ఎంఫిల్ కూడా ప్ర«థమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాను.

మరో విషయం ఏమిటంటే ఎమ్మేలో మెరిట్ కమ్ మీన్స్ అనే ఫెలోషిప్ రావడం. సాధారణంగా ఇటువంటివి టాపర్స్‌కి ఇస్తారు. అయితే మా బ్యాచ్‌లో అందరూ ఆర్థికంగా ఉన్నవాళ్లు. దాంతో వాళ్లెవరూ దరఖాస్తు చేసుకోలేదు. అలా నాకు వచ్చింది. 'ఉన్నతవిద్యలో సమానావకాశాలు' అనే అంశంపై పిహెచ్‌డి చేస్తున్నాను. ఇప్పుడు మూడో సంవత్సరం. ఫెలోషిప్ డబ్బుతో ల్యాప్‌టాప్ కొన్నాను. ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తుండగా కనిపించిన అవకాశాలకు దరఖాస్తు చేశాను.

ఫిలిప్పీన్స్, సైప్రస్‌లలో సెమినార్లలో పాల్గొనేందుకు ఎంపికయ్యాను. కాని వాళ్లు స్పాన్సర్ చేయలేదు. సొంత ఖర్చులంటే నాకు కష్టం. అందుకని ఆ అవకాశాలు వదులుకున్నాను. జర్మనీలోని బెర్లిన్ యూనివర్శిటీలో 'సెంటర్ ఫర్ సొసైటీ అండ్ టెక్నాలజీ' డిపార్టుమెంట్ వాళ్లు నిర్వహిస్తున్న సదస్సుకు మాత్రం వాళ్లే అన్ని ఖర్చులు భరిస్తూ నన్ను సెలెక్ట్ చేశారు. ఇందులో పాల్గొనడం కోసం ఈ నెల 28 న బయల్దేరుతున్నాను. 'ప్రపంచీకరణ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతిన్న తీరు'పై పేపర్ సమర్పిస్తున్నాను.

అదృష్టం కూడా తోడ్పడింది

ఈ యూనివర్శిటీ గొప్పతనం గురించి మా వాళ్లకేమీ తెలియదు. ఆ మధ్య 'జర్మనీ వెళ్తున్నాను' అంటే జపాన్‌కా అని అడిగారు. ఆ... అదే అన్నాను. వాళ్లకి అమెరికా, జపాన్ తప్ప వేరే దేశాలు తెలియదు. ఎక్కువసార్లు వినడం వల్ల అమెరికా పేరు, రేడియోలు, ట్రాన్సిస్టర్‌ల వంటివాటివల్ల జపాన్ పేరు వాళ్లకు తెలుసు. నాకు వస్తున్న ఫెలోషిప్ నుంచి కూడబెట్టి ఒకసారి అమ్మా నాన్నల్ని విమానం ఎక్కించి తిరుపతి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను.

నా దగ్గర ఒక వారం రోజులు ఉంచుకుని హైదరాబాద్ అంతా తిప్పి చూపించాను. నాన్నకి 70, అమ్మకి 65 యేళ్లు ఉంటాయి. వాళ్ల కళ్లలో కనిపించిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. బాగా స్థిరపడిన తరువాత వాళ్లని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకుంటాను. నేనేది అడిగినా కాదనలేదు. బహుశా నా ఆలోచనలకు వాళ్లిచ్చిన స్వేచ్ఛే నన్ను ఇంతటి వాడ్ని చేసింది కాబోలు. వీటన్నిటితో పాటు నా జీవితంలో అదృష్టం ప్రధాన పాత్ర పోషించింది. ఈ స్థాయికి చేరుకోవడానికి తెల్లవారుఝామునే లేచి చదవడం, విపరీతంగా కష్టపడడం వంటివి చేయలేదు.

కాని చదువుకుంటేనే బతకగలను అనుకున్నాను. 'చదువు దారి మరిచావో... గొర్రెలు కాయాల్సిందే' అనే విషయం హెచ్చరికలా నా బుర్రలో తిరుగుతుండేది. అదే నాలో పట్టుదలని పెంచింది. ఆంగ్లంలో పట్టు సాధించడం కోసం తెలుగు సినిమాలు, చానళ్లు చూడడం మానేశాను. చూసినా, చదివినా అంతా ఇంగ్లీషే. అంత స్ట్రిక్ట్‌గా నా చుట్టూ ఆంగ్ల ప్రపంచాన్ని నిర్మించుకున్నాను.

భవిష్యత్తు కళ్లముందు కనిపించినప్పుడే దేన్నయినా సీరియస్‌గా తీసుకుంటాం. లేకపోతే నేనీ స్థాయికి వచ్చే వాడినా చెప్పండి. 'వాటీజ్ యువర్ నేమ్?' అని అడగడానికే కాళ్లు చేతులు వణికిపోయేవి. అలాంటి నేను ఇప్పటికే మూడు నాలుగుసార్లు స్టేజి ప్రెజెంటేషన్ ఇచ్చాను.''
 
- కిరణ్మయి
ఫోటోలు: మునావర్‌ఖాన్

Wednesday, March 9, 2011

టాంజానియా అన్నీ ఆర్గానిక్ పంటలే

ఉద్యోగాల నిమిత్తం అమెరికా, యుకె, ఆస్ట్రేలియాలకే కాదు ఆఫ్రికా దేశాలకూ వెళ్తున్నారు మనవాళ్లు. సాధారణంగా ఆఫ్రికా దేశాలనగానే పోషకాహార లోపంతో ఉన్న పిల్లల దృశ్యం ఒకటి కళ్ల ముందు మెదులుతుంది ఎక్కువమందికి. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరి మరోవైపు ఉన్నదేంటి? "అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దానితోపాటు ప్రకృతి వినాశనం ఎక్కువగా జరుగుతోంది కాని ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడుంటే ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది'' అంటున్నారు టాంజానియా వాణిజ్య రాజధానిగా పిలవబడే దార్-ఎస్-సలాంలో ఉంటున్న మంతెన వెంకట కృష్ణమూర్తి రాజు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

సంప్రదాయ వంటల్లో మొక్కజొన్నపిండితో తయారుచేసిన ఉగాలి అనే ఉప్మాలాంటి వంటకం, మనదగ్గర బూరెల్లాగా చేసుకునే 'మందాజి' అనే వంటకం ఫేమస్. ఆహారపు అలవాట్లు కొంచెం పశ్చిమదేశాల అలవాట్లకు దగ్గరగా ఉంటాయి. అందుకనే కాబోలు బంగాళాదుంపల చిప్స్, కూల్‌డ్రింక్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు.

"దార్-ఎస్-సలాం రావడం అనుకోకుండా జరిగింది. 2006 ఫిబ్రవరిలో గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజిలో వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాను. అదే మేనేజ్‌మెంట్ దార్-ఎస్-సలాంలో ఇంటర్నేషనల్ మెడికల్ అండ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ నడుపుతోంది. నేను గుంటూరులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే... వాళ్లు నన్ను అక్కడికి పర్సనల్ మేనేజర్‌గా పంపించారు. అలా 2007లో వచ్చాను. ఇప్పటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి.

మా యూనివర్శిటీ నగరానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌లో కోటీ నుంచి మియాపూర్ వరకు వెళ్లినంత దూరం. మాకు క్యాంపస్‌లోనే వసతి ఏర్పాటు ఉంది. మొదటి రెండు సంవత్సరాలు ప్రతి ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి టౌన్‌కి వెళ్లి షాపింగ్ చేసేవాళ్లం. అలాగే దేవాలయానికి వెళ్లి కొంతసేపు గడిపి, ఇండియాకి ఫోన్ మాట్లాడుకుని తిరిగి వచ్చేవాళ్లం. గత రెండేళ్లుగా ఇక్కడి తెలుగు వాళ్లు ఏర్పాటుచేసుకున్న తరంగిణి సాంస్కృతిక సంస్థకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాను. దాంతో నగరంలోకి వెళ్లడం ఎక్కువైంది.

ఉగాలి, మందాజిలు బాగుంటాయి

సుమారు ఎనిమిది వందల మంది తెలుగు వాళ్లు ఉన్నారిక్కడ. భారత సంతతి వాళ్లు నివాసముండే ప్రాంతాల్లో నెలకు ఆరు వందల డాలర్లు ఆ పైనే ఉంటాయి అద్దెలు. ఆహారపదార్ధాలు, బట్టలు ఎక్కువగా చైనా వంటి దేశాల నుంచి దిగుమతి అవుతాయి. అందుకే ధర కాస్త ఎక్కువే. ఇక్కడ జీవనం ఖర్చుతో కూడుకున్నదే. మన హైదరాబాద్‌తో పోల్చుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. రూపాయల్లో చూసుకుంటే కూల్ డ్రింక్ 17 రూపాయలు, కేజీ బియ్యం 40 నుంచి 80 రూపాయలు, కేజీ కూరగాయలు 30 నుంచి 40 రూపాయలు ఉంటాయి.

గుజరాతీలు నడిపించే కిరాణా షాపుల్లో దాదాపు అన్ని వస్తువులూ దొరుకుతాయి. బొంబాయిరవ్వ, ఇడ్లీరవ్వ వంటివి మన దేశం నుంచి దిగుమతి చేసి అమ్ముతుంటారు. అందుకని తెలుగు వంట రుచి తగ్గకుండా తినొచ్చు.

ఇక్కడి సంప్రదాయ వంటల్లో మొక్కజొన్నపిండితో తయారుచేసిన ఉగాలి అనే ఉప్మా లాంటి వంటకం, మనదగ్గర బూరెల్లాగా చేసుకునే 'మందాజి' అనే వంటకం ఫేమస్. ఆహారపు అలవాట్లు కొంచెం పశ్చిమదేశాల అలవాట్లకు దగ్గరగా ఉంటాయి. అందుకనే కాబోలు బంగాళాదుంపల చిప్స్, కూల్‌డ్రింక్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఫెర్టిలైజర్స్ వాడకుండా పంటలు

కూరగాయలు ఎంతో తాజాగా ఉంటాయి. దానివల్ల వంటకు రుచి పెరుగుతుంది. ఇక్కడో ఆసక్తికర విషయం చెప్పాలి... ఈ ప్రాంతంలో పంటలు పండించడానికి ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ వంటివి వాడరు. కారణం నేల సారవంతంగా ఉండి, సమయానుకూలంగా వర్షాలు పడడమే కావచ్చు. అలాగే మన దగ్గరలాగా ఎంత ఖర్చుపెట్టయినా సరే... ఎకరానికి 50 బస్తాలు పండించాలనే దృక్పథం ఇక్కడి వారికి లేకపోవడం కూడా కావొచ్చు.

మొత్తంమీద ఆర్గానిక్ పంటలన్నమాట. జీడిపప్పు, కొన్ని రకాల సుగంధద్రవ్యాలు విరివిగా లభిస్తాయి. దాంతో జీడిపప్పును మన దగ్గర పల్లీల్లాగా లాగించేస్తుంటారు చాలామంది. వైద్యం విషయానికి వస్తే... సాధారణ వైద్యం వరకు ఫర్వాలేదు. కాని క్లిష్టమైన ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యం కష్టమే. పక్క దేశాలకి పరుగెత్తాల్సిందే. డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాళ్లు మన దేశాల వంటి దేశాలకు వెళ్తుంటారు.

భాషా సమస్య ఉండదు
ఇక్కడ పనిచేసేందుకు వచ్చేవాళ్లకి భాషతో ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. చాలావరకు ఇంగ్లీష్ మాట్లాడతారు. కింది స్థాయి ఉద్యోగులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ప్రాంతీయ భాష స్వాహిలి తప్పక రావాలి. ఆ భాషకు లిపి లేకపోవడంతో ఇంగ్లీషు అక్షరాల్లో రాస్తారు. అంటే ట్రాన్స్‌లిటరేషన్ అన్నమాట. ఒకప్పుడు బ్రిటీష్ కాలనీగా ఉండడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడడం బాగా అలవాటయ్యింది వీళ్లకు.

దేశవిదేశీ సంస్కృతుల మిశ్రమంగా ఉంటుంది ఇక్కడి సంస్కృతి. సంప్రదాయబద్ధమైన దుస్తులతో పాటు, పాశ్చాత్య దుస్తులను కూడా ధరిస్తారు. జనాభాలో దాదాపు 60 శాతం ముస్లింలు ఉంటారు. మిగతావాళ్లు క్రైస్తవులు. రెండు మతాల సంప్రదాయ పండుగలు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కుటుంబ వ్యవస్థకు ఎంతో గౌరవమిస్తారు. ఆచారాలకు కట్టుబడి ఉంటారు. ఇప్పటికీ కన్యాశుల్కం పద్ధతినే అనుసరిస్తారు.

గ్రామాలు, పట్టణాల్లో సదుపాయాలు ఇంకా అభి వృద్ధి చెందాలి. వృత్తివిద్యలు, చెక్కబొమ్మలు తయారుచేయడం, పశువులపెంపకమే (మసాయిలు అనే తెగ పూర్తిగా దీనిమీదే ఆధారపడుతుంది) ఇక్కడి వాళ్లకి జీవనోపాధి. వీటితోపాటు టూరిజం, చేపల పరిశ్రమ కూడా ఉపాధి కల్పిస్తుంది. ఐటి రంగం అంతగా అభివృద్ధిచెందలేదు.

అకౌంట్స్‌లో అవకాశాలు

విదేశాల నుంచి వచ్చే వాళ్లకి అకౌంట్స్ విభాగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. సిఎ, సిఎ (ఇంటర్) చేసిన వాళ్లకి, ట్యాలీవంటి అకౌంటింగ్ ప్యాకేజీలు చేయగలిగిన వాళ్లకి ఉద్యోగావకాశాలు ఎక్కువ. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకి కనీస ఆదాయం 500 అమెరికన్ డాలర్లు ఉంటుంది. రేడియో, టివి, మల్టీప్లెక్స్ సినిమాలు, క్లబ్బులు, కాసినోవాలు, హోటళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవలేదు. ఇంగ్లీషు, హిందీ సినిమాలు వస్తాయి. స్థానికంగా సినిమాల నిర్మాణం చాలా తక్కువ. మన దేశంలో సినిమాలు విడుదలయినప్పుడే ఇక్కడా విడుదలవుతాయి. అందుకని సినిమాలంటే ఇష్టమున్న వాళ్లకి వాటిని మిస్ అవుతామని ఫీలవ్వక్కర్లేదు.

కిళి మంజారో... భళా భళీ మంజారో...

రెండు వందల ఏళ్ల క్రితం ఇండియాను బ్రిటిష్ వాళ్లు పాలిస్తున్న కాలంలో... టాంజానియా-జాంజిబార్‌లకు రైల్వే లైను వేయడంకోసం కొందరు గుజరాతీలను షిప్పుల్లో టాంజానియాకి తీసుకుని వచ్చారు. అలా ఇక్కడ సెటిలైపోయిన గుజరాతీలు ఇప్పుడు వ్యాపారస్తులుగా మారిపోయారు. టాంజానియా జనాభాలో ఇప్పుడు వాళ్లు రెండు నుంచి మూడు శాతం వరకు ఉంటారు. ఒక రకంగా ప్రధాన ఆదాయ వనరులు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులతో పాటు ఉత్తరభారత దేశ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అందుకని ఇండియన్ రెస్టారెంట్లు ఎక్కువగానే కనిపిస్తాయి. దాంతో ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. తెలుగు వాళ్లం తరంగిణి సాంస్కృతిక సంఘం పెట్టుకున్నట్టే మిగతా భాషల వాళ్లు వాళ్ల సంఘాలు ఏర్పాటుచేసుకున్నారు.

మౌలిక సదుపాయాల దృష్ట్యా కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ శాంతిభద్రతల పరంగా బాగానే ఉంటుంది. నేరాలరేటు కెన్యా, ఉగాండావంటి పొరుగు దేశాలతో పోలిస్తే తక్కువ. పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు బోలెడు ఉన్నాయి ఇక్కడ. సెరంగటి జాతీయ పార్క్, మికూమి నేషనల్ పార్క్, సఫారీలు, కిలిమంజారో పర్వతం... ప్రత్యేక ఆకర్షణలు. రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యమే. భారత సంతతికి చెందిన ఐదుగురు సభ్యులు ఈ సారి పార్లమెంట్‌కి ఎంపికవడం మరో విశేషం .

Tuesday, February 22, 2011

ఆరుదైన రంగం.. అదిరెను పనితనం

దేవితా షరాఫ్‌.. జెనిత్‌ కంప్యూటర్స్‌ అండ్‌ ది బ్రెయిన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఒడిస్సీ డాన్సర్‌, వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఆన్‌లైన్‌ కాలమిస్ట్‌.. భారతదేశపు శక్తివంతమైన మహిళ జాబితాలో స్థానం సాధించుకున్న యువ తరంగం. సాధించాల్సిన లక్ష్యాల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేయడం ఆమెకు ఇష్టం. మగవారికే పరిమితం అయిన టెక్నాలజీ రంగంలో ముందుకెళ్తున్న ఆమెను ఎవరైనా టామ్‌ బాయ్‌ అని అంటే ఒప్పుకోదు. సాధించాల్సిన లక్ష్యాల కోసం నిరంతరం శ్రమిస్తూ ముందుకెళ్తోంది ఈ టెక్నాలజీ తరంగం.


devathasherifపెదవుల మీద చెరగని చిరునవ్వుతో కనిపించే దేవితాను చూసిన ఎవరికైనా ఆమె ఓ కమర్షియల్‌ వ్యాపారవేత్త అని అంటే నమ్మలేరు. అంత సౌమ్యం గా కనిపించే ఆమె వ్యాపార విషయంలో ఏ చిన్న పొరపాటును కూడా ఒప్పు కోరు. అన్ని విషయాల్లోనూ ఖచ్చితంగా వుండటం వల్లే నేడు తాను ఈ స్థాయికి వచ్చానని దేవిత అంటారు.

అన్నీ నిర్ణీత సమయంలోనే...
‘మగవారి పెత్తనడం నడిచే ఈ ప్రపంచంలో ఆడవారు నెగ్గుకు రావడం కష్టమై న వ్యవహారం. కానీ తలచుకుంటే మాత్రం అసాధ్యం కాదు’ అన్నది దేవిత అం తరంగం. ‘మన చుట్టూ వున్నవారిని ఎన్ని ప్రశ్నలు అడిగినా లేదా ఎన్ని సలహా లు అడిగినా ఇస్తారు. ఎందుకంటే ఆడవారు కష్టపడుతుంటే చూడలేరు. అదే వారితో పోటీగా వస్తే మాత్రం సహించలేరు. ఇటువంటి వారితో డీల్‌ చేయడం అనేది ఓ పెద్ద సవాలు. ఇక బిజినెస్‌లో ఆడ, మగ అని చూడకుండా లాభాలు, నష్టాలు రెంటిని సమన్వయం చేసుకుంటూ విజయం సాధించడం అనేది కత్తిమీద సాములాంటిది. ఈ రోజుల్లో ఆడవారు కూడా అన్ని టా ముందుకొచ్చేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఇక నా వరకు ఇది ఎవరికి సంబంధించి వారి బాధ్యత కూడా. స్వతంత్రంగా బత కడం అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వుం ది. అది ఉద్యోగమనే కాదు.. మరేదైనా సరే’ అని దేవిత అంటున్నారు.
http://bellthebull.com/wp-content/uploads/2009/09/2.jpeg
టెక్నికల్‌ రంగంపై ఆసక్తి..
లాస్‌ఏంజెల్స్‌ దక్షిణ కాలిపోర్నియా యూనివర్శిటీ నుండి బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన దేవిత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుండి గేమ్‌ థియ రీ ఆఫ్‌ స్ట్రాటెజిక్‌లో థింకింగ్‌ కోర్సును చేశారు. ‘చిన్నతనం నుండి టెక్నికల్‌ ఫీ ల్డ్‌ అంటే ఎంతో ఇష్టం. అటువైపుగా వెళ్ళాలని అనుకునేదాన్ని. సొంతంగా అనే క పరికరాలు కూడా రూపొందించేదాన్ని. చిన్న తనంలో ఇంట్లో వుపయోగించే అన్ని రకాల గృహోపకరణాల గురించి తెలుసుకుంటూ వుండేదాన్ని.

techinalవాటిని తయారుచేసే దాన్ని కూడా. నాలో వున్న టాలెంట్‌ని గుర్తించింది నాన్నే. ఆయనే నన్ను ఈ రంగంవైపు ప్రోత్సహించారు. 21 వయసు వున్నప్పుడు ట్రైనీగా జా యిన్‌ అయ్యాను. 22 వయసులో డైరెక్టర్‌గా మారాను’ అని ఎంతో ఆనందం గా చెబుతున్నారు. ఇంకా ‘టెక్నాలజీని ఇష్టపడినంత మాత్రానా ఏదో అబ్బాయి లా వుంటాననుకుంటే మాత్రం పొరపాటే. నేను అందరి అమ్మా యిల్లాగానే వుంటాను. అలాగే ఈ రంగంలో వుండే అన్ని రకాల పోటీలను అర్థం చేసుకో గలను. వాటికి అనుగుణంగా వ్యాపారాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తాను. నా చుట్టూ వుండే వారితో తగిన విధంగా వుండగలను’ అని దేవిత చెబుతోంది.

సమష్టి కృషి వల్లే..!
ఎప్పుడూ ఓ కొత్త ఛాలెంజ్‌ కోసం దేవిత ఎదురు చూ స్తూ వుంటుంది. గతేడాది ముంబయిలో జరిగిన ఫస్ట్‌-ఎవర్‌ వియు టిఇడిఎక్స్‌ గేట్‌ వేకు ఎంపికైంది. ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలల నుండి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, టెక్ని కల్‌ విభాగం వారు పాల్గొన్నారు. వీరిలో రాల్ప్‌ సైమన్‌, సేమైర్‌ స్టెయిన్‌ వంటి ప్రముఖులూ వున్నారు. ఇందులో పాల్గొనడానికి గల క్రెడిట్‌ మొత్తం ఆమె తన టీమ్‌కే ఇచ్చేశారు. ‘ఇంత గొప్ప విజయానికి కారణం నేను ఒక్కదాన్నే కాదు.. మొత్తం టీమ్‌ అందరూ కృషి చేయడం వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో నిలిచాం. అందరూ ఎంతో కష్టపడ్డారు. ఇందులో ఎంతో మంది కాలేజీ విద్యార్థుల ప్రతిభ కూడా వుంది. నేను చేసింది కేవలం కొన్ని చెక్కుల మీద సంతకాలే’ అని ఎంతో హుందాగా నవ్వుతూ అనేస్తారు.

ఓ సాధారణ అమ్మాయిలాగే..!
దేవిత బిజినెస్‌కు మాత్రమే కాదు.. ఓ సాధారణ ముంబయి అమ్మాయిలాగే సినిమాలకు వెళ్తుంది. స్నేహితులతో ఎంజాయ్‌ చేస్తుంది. చిట్‌ చాట్‌, ఫోన్‌లో కబుర్లు అన్నీ మామూలే. ‘ఇప్పటి వరకు ప్రపంచంలో 125 ప్రముఖ నగరాలు తిరిగాను. వందల మంది స్నేహితులు నాకున్నారు. అందరిలాగే నేనూ వారితో మాట్లాడతాను. చాట్‌ చేస్తాను. అలాగే వంట చేయడం అంటే చాలా ఇష్టం. చాలా బాగా చేస్తాను కూడా’ అని దేవిత చెబుతున్నారు.

టెక్నాలజీ రచయితగా....
ఓ జర్నలిస్టుగా దేవిత టెక్నాలజీకి సంబంధించి ఎన్నో కొత్త అంశాలను పరిచయం చేస్తూ వుంటారు. అత్యాధునిక విధానాల ను నేర్చుకుని మరీ అందిస్తుంటారు. ‘ఎప్పటికప్పుడు ప్రపంచం లో జరిగే చిన్న చిన్న మార్పులను, టెక్నాల జీని తెలుసుకుంటూ వుంటాను. ఏ చిన్న విషయం అయినా సరే ముందుగా తెలుసు కున్న తర్వాతే దానికి సంబంధించిన జర్నల్స్‌ రాస్తాను. ఇప్పుడు సొం తంగా నాకు ఓ కంపెనీ వుంది. దానికి సంబంధించి అభివృద్ధి కోసం కూడా నేను అన్ని విషయాలు తెలుసుకుం టాను’ అని దేవిత చెబుతోంది.

స్ఫూర్తి వీరే : ఇప్పటి వరకు తాను సాధించిన అన్నిటికీ కారణం కొందరి మహిళల జీవిత గమనమే అంటుంది దేవిత. క్వీన్‌ ఎలిజబెత్‌, మార్గరెట్‌, మహా రాణి గాయిత్రీ దేవి, రాణి లక్ష్మీబాయి వంటి వాళ్ళంద రూ తనకు ఎంతో స్ఫూర్తి నిచ్చారని చెబుతున్నారు.

పోలిక కాదు పోటీ...
దేవిత విజయ రహస్యం చెప్పేందుకు మాత్రం చాలా చిన్నదే. ‘ఎప్పుడూ ఒకరితో పోల్చుకోవడం కన్నా పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే ఎదగగలం. పోల్చుకున్నంత కాలం దానిలా తయారయ్యేందుకు మా త్రమే కృషి చేస్తాం. అదే కొత్తగా ఏదైనా చేస్తే మనకు మనమే ప్రత్యేకం గా వుంటాం. ఇతరులే మనల్ని చూసి నేర్చుకుంటారు. దీనికి నేర్చుకోవాలనే తపన వుండాలి. అది అందరికీ వుపయోగపడాలి. సం తోషాన్ని ఇవ్వాలి. సంతోషంగా నేర్చుకోవాలి. ఇది అందరికీ సాధ్యమని చెప్పలే ను కానీ నేను మాత్రం చేస్తున్నది అదే’.

ఇంకా ఎంతో దూరం ప్రయాణం చేయాలి..
‘ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఇంకా చేయాల్సింది.. ప్రయాణిం చాల్సిన దూరం చాలా వుంది. అది సాధించే వరకు నేను ఎటువంటి బంధాల్లో చిక్కుకోవాలని అనుకోవడం లేదు. అలా అని అదేదో బాధ అని చెప్పడం లేదు. నాకున్న ఆశయాలు తీరేందుకు ఇంకా చాలా కాలం పడుతుంది ఆ తరువాతే పెళ్లి’ అని ఈ వ్యాపార వేత్త చెబుతోంది. ఇక చివరిగా ‘ఎంత దూరం వెళ్ళినా సరే.. ఇంకొంచెం దూరం వెళ్ళేందుకు ప్రయత్నించాలి’ అని దేవిత ఈ తరం అమ్మాయిలకు చెబుతోంది. ఎంతో స్ఫూర్తిదాయకమైన మాటలు కదూ!