చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Tuesday, September 21, 2010

చేతబడుల మార్కెట్!

ప్రపంచ సాహిత్యానికి మన దేశం అందించిన గొప్ప రచయితలలో వి.ఎస్. నైపాల్ ఒకరు. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన నైపాల్ రచనలు చాలా నిశితంగా ఉంటాయి. అనేక ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఏడాది క్రితం ఆఫ్రికాలోని వివిధ దేశాల్లో పర్యటించిన నైపాల్- తన అనుభవాలను "ద మేస్క్యూ(మాస్క్) ఆఫ్ ఆఫ్రికా'' అనే పుస్తక రూపంలో వెలువరించారు. మన దేశంలో ప్రముఖ ప్రచురణ సంస్థ పికడోర్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అతి త్వరలో మార్కెట్‌లోకి విడుదల కానున్న ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు .............

దక్షిణాఫ్రికాలో అది శీతాకాలం. జొహ్నస్‌బర్గ్ ఎయిర్‌పోర్టు బయట వాతావరణం చాలా పొడిగా ఉంది. గడ్డి ఎండిపోయింది. రోడ్డుకు అటూ ఇటూ ఉన్న చెట్ల ఆకులు వాడిపోయి ఉన్నాయి. జొహ్నస్‌బర్గ్ నగరానికి వెళ్లే దారిలో - రోడ్డు పక్కన అనేక మంది నల్లజాతీయులు పనిచేస్తున్నారు.. నగరానికి మధ్యలో ఉన్న ఒక ప్రాంతానికి వెళ్లాను. జాత్యహంకార పాలన కుప్పకూలిన తర్వాత - భవిష్యత్తుపై భయంతో తెల్లజాతివారందరూ ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లిపోయారు. దానిని ఆఫ్రికన్లు ఆక్రమించుకున్నారు. అయితే ఆ ప్రాంతానికి వచ్చి నివాసమేర్పరుచుకున్నవారు స్థానికులు కాదు.

మొజాంబిక్, సొమాలియా, కాంగో, జింబాబ్వే వంటి దేశాల నుంచి వచ్చిన నల్లవారు. ఆఫ్రికన్లపై ఉన్న అవ్యాజమైన అనురాగం వల్ల దక్షిణాఫ్రికా ప్రభుత్వం వారు ఇక్కడ స్థిరపడటానికి అనుమతి ఇచ్చింది. పెద్ద పెద్ద భవంతులను, పెద్ద పెద్ద రోడ్లను వీరందరూ కలిసి మురికివాడలుగా మార్చేశారు. ఆ భవంతుల గత చరిత్రను ఇప్పుడు ఊహించలేం కూడా. అలా కొత్తగా ఏర్పడిన ఈ మురికివాడలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు కనిపించాయి. ఒక పాత గోదాములో- ఒకప్పడు ఈ ప్రాంతంలో విక్రయించే వస్తువులను హేళన చేయటానికా అన్నట్లు- చేతబడులు చేయటానికి అవసరమైన సామగ్రిని అమ్ముతున్నారు. వీటిలో కొన్ని ఔషధాలు కూడా ఉన్నాయి.

ఎవరికైనా చేతబడి జరిగినట్లు అనుమానం వస్తే వారు మాంత్రికుడి దగ్గరకు వెళ్తారు కదా. అప్పుడు ఆ మాంత్రికుడు వారిచేత ఈ ఔషధాలను కొనిపిస్తాడు. ఆ గోదాములో అడవుల్లో దొరికే అనేక రకాల ఔషధ మొక్కలు కుప్పగా పోసి ఉన్నాయి. వాటి వాసన భరించలేక ఎంత మొండి దెయ్యమైనా పారిపోతుందనిపిస్తుంది. ఆ పక్కనే ఎత్తుగా ఉన్న ఒక వేదిక మీద అనేక రకాల జంతువుల శరీర భాగాలు అమర్చిఉన్నాయి. వాటిని విక్రయించే వ్యాపారి ఆ పక్కనే చిన్న స్టూల్ వేసుకొని కూర్చుని ఉన్నాడు. ఒక జంతువు కాలు, దాని పక్కనే తల - ఈ విధంగా అందరికీ కనిపించే విధంగా ఆ భాగాలను అతను అమర్చాడు. ప్రతి రోజు అతను ఈ భాగాలను ఇంటికి తీసుకువెళ్లి మళ్లీ పట్టుకు రావాల్సిన అవసరం లేదు.

ఆ ప్రాంతం మున్సిపల్ అధికారులు అక్కడి వ్యాపారులు తమ వస్తువులను షాపుల్లో వదిలి వెళ్లే వెసులుబాటు కల్పించారు. వేదికకు ఒక వైపున మూడు గుర్రం తలకాయలు కనిపించాయి. వాటిపై జుట్టు ఇంకా మెరుస్తూనే ఉంది. అంటే ఆ మూడు తలకాయలు తలారి నుంచి అప్పుడే తాజాగా వచ్చినట్లున్నాయి. ఆఫ్రికాలో చేసే చేతబడుల్లో గుర్రం తలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది చాలా ఖరీదు (బహుశా తెల్లజాతి మహిళ స్థనాల కన్నా ఖరీదు కాకపోవచ్చు. దక్షిణాఫ్రికా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం గతంలో వీటిని చేతబడికి వాడేవారు).

గుర్రం తల ఖరీదు ఎంతో ఆ వ్యాపారిని అడిగి తెలుసుకుందామనుకున్నా కాని ఆ ప్రశ్న అడగటానికి ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపించింది. అప్పటికే ఆ వ్యాపారిని నేను అనేక ప్రశ్నలు వేశాను. అతను తన వ్యాపారం గురించి చాలా గొప్పగా చెప్పాడు. ప్రతి రోజు అతని దగ్గరకు నాలాంటి వారు అనేక మంది వస్తుంటారు. వారెవ్వరికీ ఆ భాగాల్ని కొనే ఉద్దేశం ఉండదు. కాని అది ఎందుకు పనికొస్తుంది? ఇదెందుకు పనికొస్తుంది? వంటి ప్రశ్నలు అనేకం వేస్తారు. దీని వల్ల ఆ వ్యాపారికి సమయం వృథా కావటం తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు. గుర్రపు తలల పక్కనే అనేక లేడి తలకాయలను కూడా పెట్టాడు వ్యాపారి. వీటిని కోకా కాయలను సగానికి ఎలా పగలకొడతారో- ఆ విధంగా పదునైన కత్తితో లేదా గొడ్డలితో ఈ లేడి తలలను పగలకొట్టినట్లున్నారు. ఆ విధంగా కొట్టకపోయుంటే - లేడి మెదడు దెబ్బతినకుండా బయటకు తీయలేరు....

అక్కడ కంపు భరించలేకుండా ఉంది. ఆ ప్రాంతంలో కేవలం జంతువుల శరీర భాగాలు మాత్రమే కాదు. కడుపు లోపల ఉండే భాగాలను - బట్టలను వేళ్లాడదీసినట్లు తాళ్లకు వేలాడగట్టారు. దీని వల్ల చేతబడి విరుగుడు నిపుణులు తమకు కావాల్సిన భాగాలను సులభంగా ఎంచుకోవటానికి వీలుంటుంది. అయితే వాటికి దుమ్ము పట్టడం వల్ల అన్నీ తెల్లగానే కనిపిస్తున్నాయి..

నేను చూసిన దృశ్యాలు నాకు చాలా నిరాశ కలిగించాయి. దక్షిణాఫ్రికా ప్రజలు జాత్యహంకారానికి వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేశారు. ఆ పోరాటం గొప్ప వ్యక్తులను సృష్టిస్తుందని నేను భావించాను. చేతబడులను వదిలిపెట్టి గొప్ప లక్ష్యాలను సాధిస్తారనుకున్నాను. ఈ మార్కెట్‌లోకి ప్రవేశించే ముందు- జాత్యహంకార మ్యూజియానికి వెళ్లాను. అక్కడ నాకు కలిగిన భావన వేరుగా ఉంది. ఈ మార్కెట్‌ను చూసిన తర్వాత నాకు రెండు ఆఫ్రికాలు కనిపించాయి. ఈ రెండూ వేర్వేరు ఆఫ్రికాలు. వీటిని ఒక చోట చేర్చటం చాలా కష్టం. అందుకే రాజకీయాలు, చరిత్ర- ఈ రెండూ దక్షిణాఫ్రికా ప్రజలపై కుట్ర పన్నాయనిపించింది.

బయటకు వచ్చేసరికి పోలీసు కార్లు చాలా కనిపించాయి. మా డ్రైవర్ వెళ్లి పోలీసులతో మాట్లాడాడు. తిరిగి వచ్చిన తర్వాత- పోలీసులు చాలా ప్రమాదకరమైన క్రిమినల్స్ వేటలో ఉన్నారని, వారిని పట్టుకోవటానికి అవసరమైన శక్తిని పొందటానికి వారు కూడా ఈ మార్కెట్‌కు వచ్చారని చెప్పాడు.

మండేలా దేనికి చిహ్నం?
స్వెటోలో ఉన్న మండేలా ఇంటిని నేను ముందే చూశాను. కానీ లోపలికి వెళ్లింది మాత్రం ఓ సోమవారం నాడు. విన్నీ మండేలాతో అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత ఇంటిలోపలికి ప్రవేశించగలిగాం. గేటులో ఐదారుగురు సెక్యూరిటీ గార్డ్స్ సూటులు వేసుకొని ఉన్నారు. ఇంటి ముందు భాగంలోనే అనేక ఫొటోగ్రాఫ్‌లు, అలంకరణ కోసం పెట్టే ప్రతిమలు ఉన్నాయి. ఫొటోగ్రాఫ్‌లన్నీ ఫ్యామిలీకి సంబంధించినవి. మిగిలినవాటిలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ప్రతిమలు, దేవుళ్ల బొమ్మలు చాలా ఉన్నాయి... మిసెస్ మండేలా గదిలోకి వచ్చింది.

నల్లటి సూట్ వేసుకుని, తన ట్రేడ్ మార్క్ అయిన విగ్గుతోను, మెడలో, చేతిలో పూసలతోను ఉంది. రాజకీయాల పట్ల అభినివేశం ఆమెలో ఏ మాత్రం తగ్గలేదు. "మండేలా అంటే ఏమిటో మీరు ఊహించలేరు. మండేలా అంటే ఖైదు. మండేలా అంటే విచారణ. ఒకప్పుడు ఏఎన్‌సీ(ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్) సభ్యులయితే చాలు.. పోలీసులు చంపేసేవారు. నాయకులందరూ జైళ్లలోనే చచ్చిపోతారనే భయం అందరిలోను ఉండేది. అలా జరిగితే ప్రజల్లో ఆశలు అడుగంటిపోతాయి. అందుకే నేను బయటకు వచ్చి పోరాటం చేశాను.

అప్పుడే నాలో భయమనేది పోయింది. అన్ని రకాల అవమానాలు, చిత్రహింసలు ఎదుర్కొన్నప్పుడు- ఇక భయపడటానికి ఏం మిగులుతుంది? భయమంటే ఏమిటో తెలియకుండా పోతుంది. ఒక రోజు రాత్రి పోలీసులు వచ్చి నా వస్తువులన్నీ ఒక వ్యాన్‌లో పడేశారు. నన్ను, నా వస్తువులను తీసుకువెళ్లి ఒక రహస్య ప్రదేశంలో వదిలేశారు. తొమ్మిదేళ్లు అక్కడే బతకాల్సి వచ్చింది''...

ఆమె జొహ్నస్‌బర్గ్‌లో ఉన్న మండేలా విగ్రహం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. "మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. తన ప్రజల కోసం జైలుకు వెళ్లిన మండేలా ఒక విప్లవ వీరుడు. అతను శాంతి మంత్రం జపిస్తూ బయటకు వచ్చాడు. జాత్యహంకారులతో సయోధ్య కుదుర్చుకున్నాడు... నా దృష్టిలో మాకు లభించింది "రాజీ స్వాతంత్య్రం''. రాజీల ద్వారా, సయోధ్యల ద్వారా మేము స్వాతంత్య్రం సాధించుకున్నాం. మండేలా కూడా దానికి అంగీకరించాడు. నల్లవారికి ఆర్థిక స్వావలంబన అనేది పెద్ద జోక్. తెల్ల పెట్టుబడిదారులు తమ జాతివారి కోసం చేసిన ఒక ఏర్పాటు. వారు కొందరు నల్లజాతివారిని తమ వ్యాపారాల్లో భాగస్వాములుగా చేసుకున్నారు. ఎవరైతే స్వాతంత్య్రం కోసం రక్తమోడ్చి పోరాడారో వారికి ఏమీ దక్కకుండా పోయింది. వారు ఇప్పటికీ మురికివాడల్లో నివసిస్తున్నారు. పారిశుద్ధ్యం లేదు. కరెంటు లేదు. విద్య లేదు..'

' అమె మండేలా గురించి మాట్లాడేటప్పుడు- 'నెల్సన్ ' అనే ముద్దుపేరును ఉపయోగించలేదు. మండేలాను ఆమె రెండు విధాలుగా చూస్తోంది. విప్లవవీరుడు మండేలా ఒకరు. ఆ తర్వాత శాంతి కోసం రాజీపడిన మండేలా ఒకరు. వీరిద్దరి మధ్య తేడా ఆమెకు తెలుసు. మండేలా నోబెల్ బహుమతిని స్వీకరించటంపై కూడా ఆమెకు అభ్యంతరాలున్నాయి. "తనను జైలులో పెట్టిన డీ క్లార్క్‌తో కలిపి మండేలా నోబెల్ బహుమతిని స్వీకరించాడు.

తనను బంధించిన వారితో కలిసి బహుమతి ఎందుకు స్వీకరించాలి? మండేలాను జైలు నుంచి విడుదల చేయటానికి డీ క్లార్క్ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కాలం ప్రభావం వల్ల మండేలాను ప్రభుత్వం విడుదల చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో- దక్షిణాఫ్రికాలో ఇంకా జాత్యహంకార పరిస్థితులే కొనసాగితే తీవ్ర హింస చెలరేగేది. అందువల్లే మండేలాను విడుదల చేయాల్సి వచ్చింది'' అని చెప్పారు విన్నీ.

No comments:

Post a Comment