చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Tuesday, August 17, 2010

"ఒక విలువ..ఒక విశ్వాసం''

పరిశ్రమ అంటే చాలా మందికి టాటానే గుర్తుకొస్తుంది. మనం వాడే వాహనాల దగ్గర నుంచి వేసుకునే మందుల దాకా- ప్రతి విషయంలోను టాటా కంపెనీలు తమ ఉత్పత్తుల ద్వారా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. అలాంటి గ్రూపుకు రతన్ టాటా తర్వాత వారసుడు ఎవరు? అతను మళ్లీ పార్సీనే అవుతాడా? మరెవరన్నానా? ఇలాంటి అనేక ప్రశ్నలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ - "టాటా- ద ఇవల్యూషన్ ఆఫ్ ఏ కార్పొరేట్ బ్రాండ్' అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ప్రముఖ రచయిత మోర్జిన్ విట్‌జెల్ రాసిన ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం...

"నేను ఆఫీసులో కూర్చుని అకౌంట్స్ చూసుకుంటున్నా. ఇంతలో తలుపు తెరుచుకుంది. విచిత్రమైన వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. నా టేబుల్ దగ్గర నిలబడి ఒక నిమిషం నావైపు చూశాడు. ఆ తర్వాత- ' నేను ఇండియాలో ఒక స్టీల్ మిల్లు నిర్మించాలనుకుంటున్నా. మీరు వచ్చి స్థలాన్ని చూడండి. డిజైన్ చేయండి. దీనికి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తా' అన్నాడు. నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. కాని అతను మాత్రం గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిలా కనబడ్డాడు...''

ఈ వాక్యాలు రాసింది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైనింగ్ ఇంజినీర్ చార్లెస్ పేజీ పిరిన్. అతని ఆఫీసుకి వెళ్లింది జమ్‌షెడ్‌జీ ఎన్ టాటా. టాటా గ్రూపు చరిత్ర ప్రారంభమయ్యేది ఈయనతోనే. ముంబాయిలో టాటా గ్రూపు ప్రధాన కార్యాలయం 'బోంబే హౌస్'కు వెళితే పాలరాతితో చేసిన జమ్‌షెడ్‌జీ టాటా విగ్రహమే ముందు కనిపిస్తుంది.

జెమ్‌షెడ్‌జీ చనిపోయి వందేళ్లు పూర్తయిన తర్వాత కూడా- ఆ గ్రూపు కార్యకలాపాలపై ఆయన ప్రభావం స్పష్టంగా మనకు తెలుస్తూనే ఉంటుంది. 'నమ్మకం..సేవ' ఈ రెండు విలువలను జెమ్‌షెడ్‌జీ గాఢంగా నమ్మారు. ఆయన చేసిన వ్యాపారాలన్నింటిలోను వీటిని చొప్పించటానికి ప్రయత్నించారు.

జెమ్‌షెడ్‌జీ నసీర్‌వాన్‌జీ టాటా గుజరాత్‌లోని నవసారి అనే పట్టణంలో 1839, మార్చి 3వ తేదీన జన్మించారు. జెమ్‌షెడ్‌జీ తండ్రి పేరు నసీర్‌వాన్‌జీ. ముంబాయిలో పేరు ప్రఖ్యాతులుగాంచిన బ్యాంకింగ్ వ్యాపారస్తుడు. అతని పూర్వీకులందరూ పర్షియాకు చెందినవారు. మతపరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి భారత్‌కు పారిపోయి వచ్చినవారు. అందుకే వారికి పార్సీలనే పేరువచ్చింది. పర్షియా నుంచి వచ్చిన తర్వాత కూడా వీరందరూ జొరాస్ట్రియన్ మతాన్నే గాఢంగా నమ్మేవారు.

వ్యాపారంలో వీరు గణనీయంగా రాణించటానికి వెనకున్న కారణాలను టాటా కుటుంబ చరిత్రపై కొన్ని పుస్తకాలు రాసిన ఆర్.ఎం.లాల్ విశ్లేషించారు. దీని ప్రకారం హిందు మత వ్యవస్థలో ఉన్న నిబంధనలు పార్సీలకు లేవు. ముఖ్యంగా విదేశీయానం చేయకూడదనే నిబంధన హిందూ మతస్థులపై తీవ్ర ప్రభావం చూపింది. కానీ పార్సీలకు ఆ పరిమితి లేకపోవడంతో విదేశాలలో విస్తృతంగా పర్యటించేవారు. బహుశా జెమ్‌షెడ్‌జీ ప్రపంచవ్యాప్తంగా పర్యటించటానికి, అక్కడ ఉన్న కొత్త అంశాలను భారత్‌లో ప్రవేశపెట్టడానికి కారణం ఇదే కావచ్చు..

(అందరి కన్నా భిన్నంగా ఆలోచించటం జెమ్‌షెడ్‌జీ ప్రత్యేకత. 90 శాతం భారతీయులకు కరెంట్ అంటే తెలియని రోజుల్లో జలవిద్యుత్ గురించి ఆలోచించటం.. కంపెనీలు పెట్టి లాభసాటిగా విక్రయించటం వంటి అనేక విషయాలకు ఆ రోజుల్లోనే జెమ్‌షెడ్‌జీ తెరతీశారు) తొలిసారిగా..

1868లో టాటా ముంబాయి సమీపంలో ఉన్న చించ్‌పోకిలి అనే ప్రాంతంలో అలగ్జాండ్రియా అనే కాటన్ మిల్లును ప్రారంభించారు. రెండేళ ్లపాటు లాభాలతో నడిపిన తర్వాత ఆ కంపెనీని విక్రయించారు. ఆ తర్వాత విదేశాలలో ఉన్న అత్యాధునిక పరిజ్ఞానాన్ని తీసుకురావటానికి ఇంగ్లాండ్‌కు వెళ్లారు. మళ్లీ 1877లో మహారాణి విక్టోరియా పేరిట ఎంప్రస్ మిల్స్‌ను స్థాపించారు. ఆ సమయంలో మన దేశంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభ దశలో ఉంది. 'స్వదేశీ' అనే పదం భారతీయుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతోంది.

అందుకే 1877లో స్థాపించిన మరొక మిల్లుకు టాటా స్వదేశీ మిల్లు అని పేరుపెట్టారు. జెమ్‌షెడ్‌జీకి ఆ సమయంలో మన గొప్ప నాయకుల్లో ఒకరైన దాదాభాయ్ నౌరోజీ సన్నిహిత మిత్రుడు. దాదాభాయ్ ప్రభావం వల్లనే 1885లో ప్రారంభమైన భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశాల్లో జెమ్‌షెడ్‌జీ కూడా పాల్గొన్నారు. అయితే పార్టీ వ్యవస్థాపకుల్లో టాటా పేరు ఎక్కడా కనిపించదు. కానీ ఆయన పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారని, జీవితాంతం పార్టీ సభ్యుడిగా కొనసాగారని అనడానికి ఆధారాలు ఉన్నాయి.

వారసత్వం మొదలు..
జెమ్‌షెడ్‌జీ టాటా చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు దోరబ్ -టాటా సన్స్‌కు ఛైర్మన్ అయ్యాడు. పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం 1910లో ' నైట్‌హుడ్' బిరుదును కూడా ప్రసాదించింది. మొదటి ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత ఆర్థిక మాంద్యం వంటి క్లిష్ట సమయాల్లో టాటా కంపెనీలను ఆయన సమర్థంగా నడిపించాడు.

దోరబ్ మరణానంతరం ఆయన సమీప బంధువు సర్ నౌరోజీ సక్‌లత్‌వాలా ఛైర్మన్ అయ్యాడు. ఆయన తర్వాత జేఆర్‌డీ టాటా కంపెనీ ఛైర్మన్‌గా 1938లో బాధ్యతలు స్వీకరించాడు. జేఆర్‌డీ టాటా తండ్రి ఆర్.డి. టాటా- ఈ గ్రూపును స్థాపించిన జెమ్‌షెడ్‌జీకి సమీప బంధువు. ఆర్.డి. టాటా కూడా టాటా సన్స్‌లో డైరక్టర్‌గా వ్యవహరించేవాడు. యూరప్‌లో టాటా గ్రూపు వ్యవహారాలను చూసేవాడు. అతని భార్య సుజాన్ బ్రిరీ ఫ్రెంచ్ దేశస్థురాలు. వీరిద్దరికి పుట్టిన జేఆర్‌డీ చిన్నతనం అంతా ఫ్రాన్స్‌లోనే గడిచింది.

1926లో ఆర్.డి. టాటా మరణించాడు. అతని స్థానాన్ని భర్తీ చేయటానికి జే.ఆర్.డీ.టాటా ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చాడు. ఎటువంటి వ్యాపారానుభవం లేని జేఆర్‌డీని టాటా గ్రూపు ఛైర్మన్‌గా చేయటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. జేఆర్‌డీ కూడా- కొద్దిసేపు మానసికంగా తప్పుదోవ పట్టడం వల్ల డైరక్టర్లు అటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని వ్యాఖ్యానించాడు. కాని జేఆర్‌డీని ఛైర్మన్ చేయటం వెనక రెండు కారణాలు ఉండి ఉంటాయని విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. మొదటిది- జేఆర్‌డీ టాటా కుటుంబానికి చెందినవాడు కావటం.

రెండోది- డైరక్టర్లు అతనిలోని శక్తియుక్తులను ముందే గ్రహించటం. జేఆర్‌డీ 53 ఏళ్ల పాటు టాటా సన్స్ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. ఆయన ఆధ్వర్యంలో గ్రూపు గణనీయంగా ఎదిగింది. 1939లో టాటా సన్స్‌లో మొత్తం 13 కంపెనీలు ఉండేవి. ఈ కంపెనీలు 290 కోట్ల విక్రయాలు జరిపేవి. 1993నాటికి (జేఆర్‌డీ పదవిని త్యజించిన రెండేళ్ల తర్వాత) ఈ గ్రూపులో 50కి పైగా కంపెనీలు ఉన్నాయి. విక్రయాల విలువ పదిహేను వేల కోట్ల రూపాయలు ఉంది. ఈ లెక్కల ఆధారంగా చూస్తే- జేఆర్‌డీ ఎంత విజయవంతమయిన నాయకుడో అర్థమవుతుంది.

ఎన్నో సమస్యలు..
1991లో టాటాసన్స్ ఛైర్మన్‌గా జేఆర్‌డీ వైదొలగాడు. రతన్‌టాటా పదవిని చేపట్టాడు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1991 దాకా ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వమే నియంత్రిస్తూ ఉండేది. 1991లో ఆర్థిక సంస్కరణల తర్వాత అనేక మార్పులు రావటం మొదలుపెట్టాయి. ఇన్ఫోసిస్, విప్రో, ర్యాన్‌బాక్సీ వంటి కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశించాయి.

వాటి వృద్ధి రేటు ఎక్కువగా ఉండేది. ఈ సమయంలో కొందరు టాటా గ్రూపు చరిత్రలో భాగమైపోయిందని కూడా భావించారు. టాటా గ్రూపును అందరూ నమ్ముతారు. ఆరా«ధిస్తారు. గౌరవిస్తారు. దేశాభివృద్ధిలో ఈ గ్రూపు పోషించిన పాత్రను అందరూ గుర్తుకుతెచ్చుకుంటూ ఉంటారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రూపు కూడా మారాల్సిన అవసరం లేదా? గత వైభవాన్ని తలుచుకుంటూ ఉండిపోవాల్సిందేనా? ఈ ప్రశ్నలతో పాటు- టాటా గ్రూపులో ఉన్న కొన్ని మౌలిక సమస్యలు తీవ్రమయ్యాయి.

1980ల నాటికి టాటా గ్రూపులో ఉన్న డైరక్టర్లు కంపెనీలపై తమ ఆధిపత్యాన్ని చలాయించటం మొదలుపెట్టారు. కంపెనీలో పనిచేసే సిబ్బంది వారికి మాత్రమే విశ్వాసపాత్రులుగా ఉండటం మొదలయింది. అనేక కంపెనీలు కాంట్రాక్టుల కోసం ఒక దానితో మరొకటి పోటీ పడటం మొదలయింది. "కొన్ని సామంత రాజ్యాలు ఉండేవి. అందరూ తమకు నచ్చిన దారిలో వెళ్లటం మొదలుపెట్టారు. ఒకే బిజినెస్‌లో ఉన్న కంపెనీలు ఒక దానితో మరొకటి పోటీ పడటం మొదలుపెట్టాయి.

ఎవరికి తోచిన విధంగా వారు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు..'' అని రతన్ టాటా ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. కంపెనీ బ్రాండ్ విషయంలో కూడా తీవ్రమైన అసందిగ్ధత ఉండేది. "మా కంపెనీ పదిహేను నుంచి ఇరవై భిన్నమైన బ్రాండులుగా ప్రజలలోకి వెళ్లేది..'' అని రతన్‌టాటా చేసిన వ్యాఖ ్యలు దీనికి నిదర్శనం. 1981లో, టాటా సన్స్ బోర్డులో సభ్యుడిగా ఉన్నప్పుడు- రతన్‌టాటా గ్రూపు మొత్తానికి ఒక వ్యూహం ఉండాలని..

దీని కోసం ఒక ప్రత్యేకమైన ఫోరం ఉండాలని ప్రతిపాదించాడు. దీనిని వివిధ కంపెనీల డైరక్టర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. తమపై అధిపత్యం కోసమే ఇలాంటి ఫోరంను ఏర్పాటు చేస్తున్నారని కంపెనీ డైరక్టర్లు భావించారు. జేఆర్‌డీ నుంచి బాధ్యతలు తీసుకున్న తర్వాత రతన్‌టాటా గ్రూపులో ఉన్న కంపెనీలకు టాటా సన్స్‌కు మధ్య సమన్వయాన్ని పెంచే చర్యలు చేపట్టారు. రతన్‌టాటా బాధ్యతలు చేపట్టే సమయానికి టాటాసన్స్‌కు- గ్రూపులో ఉన్న వివిధ కంపెనీలలో ఉన్న వాటా గణనీయంగా తగ్గిపోయింది. ఒక దశలో స్టీలును తయారుచేసే కంపెనీ టిస్కోలో టాటా సన్స్ వాటా కన్నా బిర్లాల వాటా ఎక్కువగా ఉండేది.

అంతే కాకుండా టాటా కుటుంబానికి టాటాసన్స్‌లో ఉన్న వాటా కూడా 1.5 శాతానికి పడిపోయింది. టాటాసన్స్‌లో ప్రముఖ వాణిజ్యవేత్త పలోంజి మిస్త్రీీ వాటా 17.5 శాతం ఉండేది. "ప్రస్తుతం మాకు ఈ కంపెనీలను న డిపే నైతికమైన హక్కు ఉండొచ్చు. కానీ చట్టపరమైన హక్కు మాత్రం లేదు'' అని రతన్‌టాటా చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితికి అద్దం పడతాయి. రతన్‌టాటా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని కంపెనీలలోను టాటా సన్స్ వాటాను 26 శాతానికి పెంచటానికి చర్యలు తీసుకున్నాడు.

No comments:

Post a Comment